డిల్లీ, 24 జూన్ (హి.స.)
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. 24 గంటల్లో దశల వారీగా కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని ప్రకటించారు. తాజాగా కాల్పుల విరమణను ఇరాన్ కూడా అంగీకరించింది. అయినా కూడా ఇరాన్ దాడులు చేస్తూనే ఉంది. మంగళవారం ఉదయం ఇజ్రాయెల్పై క్షిపణులు ప్రయోగించింది. ఈ ఘటనలో ఒక నివాసంపై క్షిపణి పడడంతో ముగ్గురు చనిపోయారు. భవనాలు, కార్లు ధ్వంసం అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దక్షిణ ఇజ్రాయెల్ నగరమైన బీర్ షెవాలో ఈ ఘటన జరిగింది.
ఇరానియన్ క్షిపణి దాడిలో నివాస సముదాయం పూర్తిగా ధ్వంసమైనట్లు బీర్ షెవా నుంచి ఒక వీడియో విడుదలైంది. క్షిపణి ఢీకొన్న భవనం వెలుపల కాలిపోయిన కార్లు, చెట్ల అవశేషాలు కనిపించాయి. ఇరాన్ క్షిపణి దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించారని, ఇద్దరు గాయపడ్డారని ఇజ్రాయెల్ అత్యవసర సేవలు తెలిపాయి. ఆరుగురు తేలికపాటి గాయాలతో సంఘటనాస్థలిలోనే చికిత్స పొందినట్లు వెల్లడించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు