ముంబయి, 25 జూన్ (హి.స.)టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వచ్చేవారం భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని బ్లూమ్బెర్గ్ పత్రిక కథనంలో పేర్కొంది. ఈసారి ఎక్స్బాక్స్ విభాగంలోని ఉద్యోగులను ఆ సంస్థ లక్ష్యంగా చేసుకొన్నట్లు పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు సంస్థను పునర్ వ్యవస్థీకరించడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టనున్నట్లు ఆ కథనంలో వెల్లడించారు. గత 18 నెలల్లో ఆ సంస్థ ప్రకటించిన నాలుగో అతిపెద్ద లేఆఫ్ కానుందని పేర్కొంది. ముఖ్యంగా 69 బిలియన్ డాలర్లు వెచ్చించి యాక్టివిజన్ బ్లిజార్డ్ను కొనుగోలు చేశాక.. లాభదాయకతపై దృష్టిసారించాలని ఒత్తిళ్లు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది.
రానున్న లేఆఫ్లో ఎక్స్బాక్స్ గ్రూప్లోని చాలా బృందాలు ప్రభావితం కానున్నట్లు బ్లూమ్బెర్గ్ వెల్లడించింది. గత కొంతకాలంగా మైక్రోసాఫ్ట్ చేపట్టిన లేఆఫ్ల వల్ల సంస్థ గ్లోబల్ ఆపరేషన్స్లో చాలామంది ఉద్యోగాలపై ప్రభావం పడింది. జూన్ 30తో మైక్రోసాఫ్ట్ ఆర్థిక సంవత్సరం పూర్తికానుండటంతో.. వచ్చేవారం మొదట్లోనే ఆ సంస్థ తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ