న్యూఢిల్లీ, 25 జూన్ (హి.స.)భారత అంతరిక్ష చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. విశ్వవినువీధుల్లో దేశ కీర్తిపతాక రెపరెపలాడే మధురఘట్టం ఆవిష్కృతమైంది. కోట్లమంది భారతీయుల ఆకాంక్షలు, శుభాశీస్సులను గుండెల నిండా నింపుకొని మన వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) రోదసిలోకి పయనమయ్యారు. ఆయనతో కలిసి మరో ముగ్గురు వ్యోమగాములను తీసుకుని యాక్సియం-4 (Axiom-4) నింగిలోకి దూసుకెళ్లింది.
ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్సెంటర్లో బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు (భారత కాలమానం ప్రకారం) చేపట్టిన ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లింది. కొద్ది క్షణాల తర్వాత రాకెట్ నుంచి వీరి క్యాప్సుల్ విడిపోయి ఐఎస్ఎస్ దిశగా ప్రయాణం కొనసాగించింది. వాస్తవానికి ఈ ప్రయోగం మే 29న జరగాల్సి ఉన్నప్పటికీ పలు దఫాలుగా వాయిదాపడుతూ వస్తోంది. నేడు కూడా ఈ ప్రయోగానికి కొన్ని నిమిషాల ముందు సమస్య తలెత్తగా.. శాస్త్రవేత్తలు దాన్ని సరిచేయడంతో అంతా సవ్యంగా జరిగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ