దిల్లీ: , 27 జూన్ (హి.స.) ఒకే ఒక్క కుటుంబం వల్ల దేశంలో అత్యయిక పరిస్థితి (Emergency) ఏర్పడిందంటూ కేంద్ర మంత్రి జైశంకర్ (Jaishankar) కాంగ్రెస్ను పరోక్షంగా దుయ్యబట్టారు. కుర్చీ కోసం వారు ఏదైనా చేస్తారంటూ విమర్శలు గుప్పించారు. ఎమర్జెన్సీ ప్రకటించి 50 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో దిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హయాంలో విధించిన ఎమర్జెన్సీ వల్ల దేశవ్యాప్తంగా చాలామంది జైళ్లలో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడిందని గుర్తుచేశారు. దేశంలో కాంగ్రెస్ హయాంలో అవినీతి పెరిగిపోవడం, ద్రవ్యోల్బణం ఎక్కువవడం వల్ల ప్రభుత్వానికి ప్రజాదరణ బాగా పడిపోయిందని జైశంకర్ అన్నారు. స్వేచ్ఛను ఎప్పుడూ తేలిగ్గా తీసుకోవద్దనే పాఠాన్ని అత్యవసర పరిస్థితి నుంచి దేశం నేర్చుకుందని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు