దిల్లీ: , 27 జూన్ (హి.స.)గగనతలంలో భారత్ చరిత్ర లిఖించింది. అంతరిక్ష యాత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని (ఐఎస్ఎస్) తాకాయి. భారత అంతరిక్ష చరిత్రలో ఐఎస్ఎస్ను చేరిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డు సృష్టించారు. 39 ఏళ్ల శుక్లా.. గురువారం సాయంత్రం ఐఎస్ఎస్లోకి వెళ్లగానే దేశం మొత్తం విజయగర్వంతో ఉప్పొంగిపోయింది. సంబరాలు ‘నింగి’నంటాయి.
ఫాల్కన్-9 రాకెట్ద్వారా భారత కాలమానం ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం 12.01 గంటలకు బయలుదేరిన డ్రాగన్ వ్యోమనౌక ‘గ్రేస్’.. గురువారం సాయంత్రం 400 కిలోమీటర్ల ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వద్దకు చేరింది. సరిగ్గా సాయంత్రం 4.15 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో డాకింగ్ ప్రక్రియ పూర్తయింది. దీనికి రెండు గంటల కంటే తక్కువ సమయమే తీసుకుంది. అంతరిక్ష కేంద్రానికి చేరడానికి 14 నిమిషాల ముందు సరిగ్గా 4.01 గంటలకు ఐఎస్ఎస్ హార్మనీ మాడ్యూల్తో ఉత్తర అట్లాంటిక్ సముద్రంపై ఉండగా సాఫ్ట్ క్యాప్చర్ లక్ష్యాన్ని వ్యోమనౌక సాధించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు