దిల్లీ, 28 జూన్ (హి.స.): చైనాలోని చింగ్డావ్లో నిర్వహించిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సమావేశంలో పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం రష్యా రక్షణ మంత్రి ఆండ్రియే బెలౌసోవ్తో జరిపిన భేటీలో కీలక విషయాలు చర్చకు వచ్చాయి. రెండు బ్యాచిల ఎస్-400 క్షిపణుల సత్వర సరఫరా, భారత్ వద్ద ఉన్న సుఖోయ్ 30-ఎంకేఐ యుద్ధ విమానాల ఆధునికీకరణ, ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణుల తయారీ తదితర అంశాలపై రష్యా రక్షణ మంత్రితో చర్చించారు. భారత్ వద్ద రష్యాలో రూపొందిన 260 సుఖోయ్ 30- ఎంకేఐ విమానాలు ఉన్నాయి. ఈ విమానాలను ఆధునికీకరించాలని భారత్ ఆకాంక్షిస్తోంది. ఇటీవలి ఆపరేషన్ సిందూర్లో సుఖోయ్ విమానాలు కీలక పాత్ర పోషించాయి. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా భారత రష్యా రక్షణ మంత్రులు ఇరుదేశాల మధ్య రక్షణ సహకారం బలోపేతం చేసే విషయంతోపాటు, సీమాంతర ఉగ్రవాదం తదితర భౌగోళిక రాజకీయ విషయాలపై దృష్టిసారించారని భారత రక్షణశాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. చర్చల సందర్భంగా ఆండ్రే బెలూసోవ్ పహల్గాం ఉగ్రదాడిపై భారత్కు సంఘీభావం తెలిపారు. ‘‘ఇటీవలి కాలంలో ఇరు దేశాల నేతల మధ్య జరిగిన అతి కీలక సమావేశం ఇది. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో రక్షణ ఉత్పాదన పెంపొందించాల్సిన ఆవశ్యకత పెరిగిన నేపథ్యంలో ఈ సమావేశం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది’’ అని రక్షణ శాఖ తన ప్రకటనలో పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు