కొల్హాపుర్, 28 జూన్ (హి.స.): మహారాష్ట్ర ప్రజలు హిందీభాషకు వ్యతిరేకం కాదనీ, 1-4 తరగతుల ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తప్పనిసరిగా హిందీ నేర్చుకోవాలని నిబంధన విధించడం మాత్రం తగదని ఎన్సీపీ (ఎస్.పి.) అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. 5వ తరగతి నుంచి హిందీ నేర్చుకోవడం విద్యార్థులకే మంచిదన్నారు. భాషా వివాదాలపై శుక్రవారం ఆయన స్పందిస్తూ.. దేశంలో 55 శాతం మంది మాట్లాడే హిందీని అలక్ష్యం చేయలేమన్నారు. మరాఠా, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో 1 నుంచి 5వ తరగతి వరకు హిందీని మూడోభాషగా బోధించాలని గత వారం మహారాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులతో వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర విద్యార్థులపై హిందీని రుద్దే ప్రయత్నాన్ని తాము ప్రతిఘటిస్తామని.. జులై 5, 7 తేదీల్లో విడివిడిగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎం.ఎన్.ఎస్., శివసేన (ఉద్ధవ్) పార్టీలు గురువారం ప్రకటించాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు