దిల్లీ, 28 జూన్ (హి.స.): ప్రధాని మోదీ జులై 2-9 తేదీల మధ్య విదేశాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఐదు దేశాలు సందర్శిస్తారు. పర్యటనలో భాగంగా మోదీ బ్రెజిల్లో నిర్వహించే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. భారత్, రష్యా, చైనా సహా మొత్తం పది దేశాలు బ్రిక్స్ కూటమిలో ఉన్నాయి. బ్రెజిల్తో పాటు ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, నమీబియా దేశాల్లో మోదీ పర్యటిస్తారని విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. మోదీ ముందుగా జులై 2, 3 తేదీల్లో ఘనాలో పర్యటిస్తారు. ప్రధాని హోదాలో మోదీ ఘనా సందర్శించడం ఇదే ప్రథమం. ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ఆయన ఆ దేశ అధ్యక్షుడు క్రిస్టిన్ కార్లా కంగాలూతో పాటు ప్రధానమంత్రి కమ్లా పర్సాద్ బిస్సెస్సార్తో సంప్రదింపులు జరుపుతారు. 1999 అనంతరం భారత ప్రధాని ట్రినిడాడ్ అండ్ టొబాగోలో పర్యటించడం ఇదే ప్రథమం. అర్జెంటీనాలో ఆయన రక్షణ, వ్యవసాయం, మైనింగ్, చమురు సహజవాయువు, పునరుత్పాదక విద్యుత్తు వంటి అంశాల్లో ద్వైపాక్షిక భాగస్వామ్యంపై సంప్రదింపులు జరుపుతారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు