న్యూఢిల్లీ,29 జూన్ (హి.స.)
ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య తీవ్ర
ఉద్రిక్తతల వేళ కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆరగ్చితో ఫోన్ లో మాట్లాడినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలపరిచే దిశగా చర్చ జరిగినట్లు పేర్కొంది. పశ్చిమాసియా పరిస్థితులపై చర్చించినట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఇరాన్ పై అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనలు, భూభాగ సమగ్రతపై దాడుల్ని అరఘ్చి తీవ్రంగా ఖండించారు. నేరానికి పాల్పడిన దేశాలను జవాబుదారులుగా నిలిపే విధంగా అంతర్జాతీయ సమాజం చొరవ చూపాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా జైశంకర్, ఇరాన్తో కొనసాగుతున్న దౌత్య సంబంధాల పట్ల తన ఆనందం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య నౌకాదళ సహకారానికి ఇరాన్ ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్ లో ఉన్న భారతీయులను భద్రంగా తరలించడంలో ఇరాన్ ప్రభుత్వం చేసిన సాయానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఈ ఫోన్ కాల్ సంభాషణకు ముందు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇప్పటివరకు 3,426 మంది భారతీయులను ఇరాన్ నుంచి, 818 మందిని ఇజ్రాయెల్ నుంచి 'ఆపరేషన్ సింధు'లో వెనక్కి తీసుకొచ్చామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..