ముంబై, 3 జూన్ (హి.స.) మహారాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇకపై ఒకటో తరగతి నుంచే విద్యార్థులకు ప్రాథమిక సైనిక శిక్షణ (బేసిక్ మిలిటరీ ట్రైనింగ్) ఇవ్వాలని సంకల్పించింది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో చిన్నతనం నుంచే దేశభక్తి, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం వంటి మంచి లక్షణాలను పెంపొందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దాదా భూసే వెల్లడించారు.
ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు ఈ శిక్షణ ఇవ్వడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలనే దానిపై వారికి అవగాహన కలుగుతుందని మంత్రి దాదా భూసే తెలిపారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో మాజీ సైనికులతో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ శిక్షణ ద్వారా విద్యార్థుల్లో దేశం పట్ల ప్రేమ, గౌరవం మరింత పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా సానుకూలంగా స్పందించారని విద్యాశాఖ మంత్రి దాదా భూసే వివరించారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి క్రీడా ఉపాధ్యాయులు, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ), స్కౌట్స్ అండ్ గైడ్స్తో పాటు సుమారు 2.5 లక్షల మంది రిటైర్డ్ సైనికుల సహాయ సహకారాలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి