అమరావతి, 30 జూన్ (హి.స.)
గుంటూరు,: పోలీసు శాఖ దశాబ్దాల తరబడి ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు కృత్రిమ మేధ ద్వారా పరిష్కారాలు లభించాయని, వీటిని ఆరు నెలల్లో ఏఐ ఆధారిత అప్లికేషన్ల ద్వారా అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని డీజీపీ హరీ్షకుమార్ గుప్తా పేర్కొన్నారు. గుంటూరులోని ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో మూడు రోజులపాటు జరిగిన ‘ఏఐ ఫర్ ఏపీ పోలీసు’ హ్యాకథాన్ ముగింపు కార్యక్రమం ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన డీజీపీ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆలోచనలు, సూచనలకు అనుగుణంగా జాతీయ స్థాయిలో మొదటిసారిగా ఏఐ హ్యాకథాన్ నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. 160 కంపెనీలు నమోదు కాగా.. 60 కంపెనీలను ఎంపిక చేశామని తెలిపారు. విజ్ఞాన భాగస్వామిగా ఫోర్సైట్ ఏఐ సంస్థ సీఈవో సూర్య, హ్యాకథాన్ నిర్వహణకు ఆర్వీఆర్ కాలేజీ సహకారం అందించాయన్నారు. ఈ సాంకేతిక మేథోమథనంలో పోలీసు శాఖకు ఉపయోగపడే పరిష్కారాలు లభించాయమని పేర్కొన్నారు. ప్రజల ఫిర్యాదులను వేగవంతంగా ఎలా పరిష్కరించాలనే దానిపై దృష్టి పెట్టామని, దీని వలన పోలీసు శాఖ పనితీరు కూడా వేగం పెరుగుతుందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ