అమరావతి, 4 జూన్ (హి.స.)
నిజాంపేట (హైదరాబాద్): నగరంలోని బాచుపల్లిలో ఓ ట్రావెల్ బ్యాగ్లో మహిళ మృతదేహం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. స్థానిక రెడ్డీస్ ల్యాబ్ ప్రహరీ గోడను ఆనుకుని ఖాళీ స్థలం ఉంది. అక్కడ ఓ సూట్ కేసు పడి ఉండటం.. దాని నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బుధవారం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సూట్కేసు తెరిచి చూడగా అందులో మహిళ మృతదేహం కనిపించింది. మృతురాలు మెరూన్ కలర్ చుడీదార్ ధరించి ఉన్నారు. ఆమె వయసు 25 నుంచి 30 ఏళ్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలాన్ని బాలానగర్ డీసీపీ సురేశ్కుమార్, ఇతర అధికారులు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ