కుప్పం, 5 జూన్ (హి.స.) , : కరుడుగట్టిన హరియాణా దొంగల ముఠా ఓ కారులో సరిహద్దు దాటుతున్నారనే సమాచారంతో కుప్పం పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా.. దుండగులు వారిని తొక్కించేందుకు విఫలయత్నం చేశారు. ఈ నేపథ్యంలో తప్పించుకున్న వారిని నిలువరించేందుకు కాల్పులు జరిపారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. దొంగల ముఠా కుప్పం మీదుగా సరిహద్దు దాటుతోందనే సమాచారంతో డీఎస్పీ పార్థసారథి సూచనలతో గ్రామీణ సీఐ మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో పోలీసులు కృష్ణగిరి - పలమనేరు జాతీయ రహదారి తంబిగానిపల్లె చెక్ పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. రాత్రి 10.30 గంటలకు పలమనేరు నుంచి తమిళనాడులోని కృష్ణగిరి వైపు వెళ్తున్న కర్ణాటక రిజిస్ట్రేషన్ కలిగిన స్కార్పియో కారును తనిఖీ కోసం పోలీసులు నిలిపారు. ఇద్దరు కానిస్టేబుళ్లు కారును తనిఖీ చేసేందుకు ముందుకు వెళ్లగా అప్రమత్తమైన దొంగలు కారును వెనక్కి పోనిచ్చి కానిస్టేబుళ్లపైకి ఎక్కించేందుకు యత్నించారు. వెంటనే వారు పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. వారు దొంగల ముఠాగా నిర్ధారించుకున్న గ్రామీణ సీఐ మల్లేష్ యాదవ్ ఫైరింగ్ ఓపెన్ చేశారు. తన సర్వీసు రివాల్వర్తో కారు డ్రైవర్ తొడకు తగిలేలా ఓ రౌండ్ కాల్పులు జరిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ