అమరావతి, 5 జూన్ (హి.స.), : విజయవాడలో మంగళవారం అర్ధరాత్రి నిర్వహించిన ఐపీఎల్ ఆర్సీబీ క్రికెట్ జట్టు విజయోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. స్థానిక వించిపేటకు చెందిన తాడిగిరి శేఖర్(30) రైల్వే పార్సిల్ కార్యాలయంలో పని చేస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి ఆర్సీబీ గెలిచిందని తన స్నేహితులు ఉదయ్ కుమార్, శ్రీనాథ్లతో కలిసి ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొన్నాడు. 12.15 గంటల సమయంలో బందరు రోడ్డులోని చైతన్య కళాశాల వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి ముగ్గురూ కింద పడ్డారు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న కారు శేఖర్పై నుంచి వెళ్లగా తీవ్రంగా గాయపడ్డారు. స్నేహితులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ అర్ధరాత్రి 1 గంట సమయంలో మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రకాష్ తెలిపారు. పరారైన కారు ఆచూకీ కోసం సీసీ ఫుటేజీ సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ