న్యూఢిల్లీ, 7 జూన్ (హి.స.)కెనడాలో ఈ నెలలో జరగనున్న 51వ G7 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ మేరకు మోదీ శుక్రవారం (జూన్ 6) ఎక్స్ వేదికగా ప్రకటించారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నే నుంచి కాల్ అందుకోవడం సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. ఇటీవల జరిగిన కెనడా ఎన్నికల్లో ఆయన సాధించిన విజయాన్ని అభినందించారు. జూన్ చివర్లో కననాస్కిస్లో జరిగే G7 శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం పంపినందుకు కార్నేకు మోదీ ధన్యవాదాలు తెలిపారు.
శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలుగా భారత్ – కెనడా ఎదుగుతున్నాయని, పరస్పర గౌరవం, ఉమ్మడి ఆసక్తుల ద్వారా మార్గనిర్దేశం చేస్తూ నూతన శక్తితో కలిసి పనిచేస్తాయని అన్నారు. శిఖరాగ్ర సమావేశంలో మా సమావేశం కోసం ఎదురు చూస్తున్నానని ప్రధాని మోదీ తన పోస్ట్లో పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ 15 నుండి 17 వరకు కెనడాలో జరగనున్న G7 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ హాజరుకారనే పుకార్ల నేపథ్యంలో తాజా పరిణామం ఆసక్తికరంగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి