బెంగళూరు , 7 జూన్ (హి.స.)బెంగళూరు (Bengaluru)లోని చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ (RCB) విజయోత్సవ వేడుకల్లో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఈ మేరకు ఇవాళ ఉదయం కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (KSCA)కు సెక్రటరీ ఏ.శంకర్ (A Shankar), ట్రెజరర్ జైరామ్ (Jairam) తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత రెండు రోజుల్లో ఊహించని దురదృష్టకర ఘటన జరగడం బాధకరమని అన్నారు. అందులో తమ పాత్ర చాలా పరిమితమైనదే అయినప్పటికీ నైతిక బాధ్యతను స్వీకరిస్తూ పదవులకు రాజీనామా చేస్తున్నామని తెలిపారు. తమ రాజీనామా లేఖను ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు రఘురామ్ భట్ (Raghuram Bhat)కు అందజేశామని పేర్కొన్నారు.
కాగా, చిన్నస్వామి తొక్కిసలాట ఘటనలో తమపై దాఖలైన ఎఫ్ఐఆర్ (FIR)లను కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘురామ్ భట్, పలువురు ఆఫీస్ బేరర్లకు ఊరట లభించింది. ఈ మేరకు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. తొక్కిసలాట ఘటనకు సంబంధించి కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) కార్యవర్గ సభ్యులపై ఎలాంటి కఠిన చర్యలూ తీసుకోవద్దని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులకు అరెస్ట్ నుంచి రక్షణ లభించింది. పిటిషనర్లు అందరూ కోర్టు ప్రాదేశిక పరిధిని దాటి వెళ్లొద్దని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఆర్ కృష్ణ కుమార్ (Justice SR Krishna Kumar) ఆదేశించారు. ఒకవేళ దూర ప్రాంతాలకు వెళ్లాలని భావిస్తే తప్పకుండా కోర్టు అనుమతిని తీసుకోవాలన్నారు. కేసు విచారణకు సహకరించాలని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) అధికారులకు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి