హైదరాబాద్, 7 జూన్ (హి.స.)రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక రేట్లను 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించడం.. మన స్టాక్ మార్కెట్లో జోష్ నింపింది. నగదు నిల్వల నిష్పత్తిలో (సీఆర్ఆర్) 1% కోత విధించడం వల్ల డిసెంబరు కల్లా బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ.2.50 లక్షల కోట్ల అదనపు నిధులు వచ్చే వీలుండటంతో వడ్డీ రేట్ల ప్రభావిత రంగాల షేర్లు దూసుకెళ్లాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 747 పాయింట్ల మేర లాభపడగా.. ఎన్ఎస్ఈ నిఫ్టీ తిరిగి 25,000 పాయింట్ల ఎగువకు వెళ్లింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 11 పైసలు పెరిగి 85.68 వద్ద ముగిసింది. బ్రెంట్ ముడి చమురు 1.62% పెరిగి 66.39 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, తైవాన్ మినహా మిగతా ప్రధాన దేశాల స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లూ లాభాల్లోనే మొదలయ్యాయి.
బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మార్కెట్ విలువ శుక్రవారం రూ.3.63 లక్షల కోట్లు పెరిగి రూ.451.13 లక్షల కోట్ల (5.26 లక్షల కోట్ల డాలర్ల)కు దూసుకెళ్లాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు