తిరుమల, 8 జూన్ (హి.స.)
,: వేసవి సెలవులు ముగుస్తుండటంతో పాటు వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. శనివారం శ్రీవారి ఆలయ పరిసరాలతో పాటు తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాల్లో యాత్రికుల సందడి నెలకొంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని 9 షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి. కృష్ణతేజ విశ్రాంతి భవనం మీదుగా రింగురోడ్డులో బాటగంగమ్మ కూడలి వరకు క్యూలైన్ రెండు కిలోమీటర్ల మేర వ్యాపించింది. వీరికి 18 గంటల దర్శన సమయం పడుతోంది. ఇక, స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఉన్న భక్తులకూ దాదాపు మూడు గంటల తర్వాత దర్శనం లభిస్తోంది. కల్యాణకట్టలు, లడ్డూ కేంద్రం, అఖిలాండం, అన్నప్రసాద భవనాలూ రద్దీగా మారాయి. గదులకు డిమాండ్ మరింత పెరిగిపోయింది. గదులు పొందేందుకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరాల్సి వచ్చింది. సీఆర్వో ప్రాంతమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. అలాగే అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు జారీ చేసే భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసం కూడా రద్దీగా మారాయి.
Updated Date - Jun 08 , 2025 | 05:12 AM
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ