అమరావతి, 8 జూన్ (హి.స.)ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను ఉద్దేశించి సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. జనసేన పార్టీ పల్నాడు జిల్లా నరసరావుపేట మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ నరసరావుపేట గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తూ.. ఇర్ఫాన్ అనే యువకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ను దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు.
లక్ష్మీనారాయణ ఫిర్యాదు ప్రకారం.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 4న గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించారు. ఆ సమయంలో అక్కడకు వెళ్లిన ఇర్ఫాన్.. సోషల్ మీడియాలో పవన్పై దూషణలకు పాల్పడినట్టు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం ములకలూరు గ్రామానికి చెందిన ఇర్ఫాన్ను శనివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై తదుపరి విచారణ జరుగుతోందని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి