అమరావతి, 16 జూలై (హి.స.)
తిరుమల: తిరుమలలో ఆణివార ఆస్థానం ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా మలయప్పస్వామి వారు ఉభయదేవేరులతో సర్వభూపాల వాహనంపై వేంచేశారు. మరో పల్లకిలో సర్వ సైన్యాధ్యక్షడు విష్వక్సేనులు దక్షిణ అభిముఖంగా వేంచేశారు. ఉత్సవ మూర్తులతో పాటు మూలవిరాట్కు ప్రత్యేక పూజలు చేశారు. జీయర్లు ఊరేగింపుగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సాయంత్రం 6 గంటలకు పుష్పపల్లకి వాహనంపై మలయప్పస్వామి ఊరేగనున్నారు.
సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతినాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు. పూర్వం ఈ ఆణివార ఆస్థానం పర్వదినంనాటి నుంచి తితిదే వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. తితిదే ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్ను మార్చి-ఏప్రిల్ నెలలకు మార్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ