గుంటూరు/విజయవాడ , 16 జూలై (హి.స.)
రాజధానిలో జాతీయ స్థాయి గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్-2025 జరగనుంది. ఈనెల 18, 19 తేదీల్లో జరిగే సమ్మిట్కు నీరుకొండలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వేదిక కానుంది. ఇందుకోసం చకాచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కార్యక్రమం నిర్వహణలో ఎస్ఆర్ఎం వర్సిటీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్ఆర్ఈడీసీఏపీ, ఐఐటీ తిరుపతి, ఐఐఎ్సఈఆర్ తిరుపతి, కేంద్ర ప్రభుత్వ విద్యుత్ శాఖలు భాగస్వామ్యం కానున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో మొట్టమొదటసారిగా జరుగుతున్న ఈ సమ్మిట్ను ఎన్టీపీసీ, భారత్ పెట్రోలియం, హైడ్రోజన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, సినర్జెన్ గ్రీన్ ఎనర్జీ, ఏసీఎంఈ, కేపీ, యమ్నా, ఈవీఆర్ఈఎన్ వంటి సంస్థలు స్పాన్సర్ చేయనున్నాయి. రెండు రోజులు జరిగే సమ్మిట్ను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని ఎస్ఆర్ఎం గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(రీసెర్చ్) డి.నారాయణరావు తెలిపారు. సదస్సులో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్, నీతి ఆయోగ్ మెంబర్ డాక్టర్ వీకే సారస్వత్లతో పాటు రాష్ట్ర సీఎస్ విజయానంద్ పాల్గొంటున్నట్లు చెప్పారు. ఇక సమ్మిట్లోని టెక్నికల్ సెషన్స్లో పలు సమస్యలపై చర్చించనున్నారు. సమ్మిట్లో పాల్గొనేందుకు ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ