దిల్లీ: 27 జూలై (హి.స.)
పాకిస్తాన్ పై భారత్ ఎంతో విజయవంతంగా నిర్వహించిన మిలిటరీ ఆపరేషన్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పాఠ్య పుస్తకాల్లో భాగం కానుంది. సిందూర్తో పాటు చంద్రయాన్, ఆదిత్య ఎల్1 అంతరిక్ష మిషన్లు, ఇటీవల శుభాన్షు శుక్లా ‘‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)’’కు వెళ్లిన ప్రయోగాలను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేుషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) పాఠ్యాంశాలుగా చేర్చాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ భావిస్తోంది.
రెండు మాడ్యుల్స్ ప్రస్తుతం డెవలప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి 3 నుంచి 8వ తరగతి విద్యార్థుల కోసం రూపొందిస్తున్నారు. రెండోది 9 నుంచి 12వ తరగతుల కోసం ఉద్దేశించబడింది. ప్రతీ మాడ్యూల్ సుమారు 8 నుంచి 10 పేజలు ఉంటుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ఎలా అమలు చేసిందనే వివరాలను ఈ పాఠ్యాంశాల్లో పొందుపరచనున్నారు. భారత సైనిక, వ్యూహాత్మక ప్రయాణం గురించిన కీలక మైలురాళ్లు ఇందులో ఉంటాయి.
“భారతదేశ సైనిక శక్తి, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి తీసుకున్న నిర్ణయాత్మక చర్యలు, మంత్రిత్వ శాఖల మధ్య రక్షణ, దౌత్యం, సమన్వయం జాతీయ భద్రతలో ఎలా పాత్ర పోషిస్తాయనే దాని గురించి యువ మనస్సులకు అవగాహన కల్పించడం దీని ఉద్దేశ్యం” అని మంత్రిత్వ శాఖలో ఒక సీనియర్ అధికారి అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ