ఢిల్లీ, 6 జూలై (హి.స.)విజయనగరం ఉగ్రపేలుళ్ల కేసులో ఎన్ఐఏ దూకుడు పెంచింది. ఉగ్రవాదులు సమీర్, సిరాజ్లను ఢిల్లీకి తరలించి విచారించడానికి ఎన్ఐఏ అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కేసును ఎన్ఐఏకు అప్పగించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానకిి కేంద్ర హోం శాఖ నుండి ఆదేశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ నుండి జిల్లా ఎస్పీకి ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది. సోమవారం ఈ కేసును పూర్తిగా ఎన్ఐఏకు అప్పగించేందుకు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అహిమ్ అనే ఉగ్రవాద సంస్థలో సిరాజ్ కీలక వ్యక్తిగా ఉండటంతో ఈ సంస్థకు సంబంధించిన వివరాలు సేకరించే పనిలో ఎన్ఐఏ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సంస్థ సభ్యులు దేశవ్యాప్తంగా ఉండటంతో వేగంగా పురోగతి సాధించి చర్యలు తీసుకుంటోంది. ఇదిలా ఉంటే విజయనగరంలో ఉగ్రకుట్ర పన్నారని గత నెల విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్ కు చెందిన సమీర్లను అరెస్ట్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి