విశాఖపట్నం 28 ఏప్రిల్ (హిం.స): కొంతమంది తనపై దాడికి ప్లాన్ చేశారని జై భారత్ నేషనల్ పార్టీ () అధ్యక్షుడు లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. తాను సీబీఐ జేడీగా ఉన్నప్పుడు ఓ వ్యక్తిని అరెస్ట్ చేయడంతో కొన్ని నెలల పాటు జైల్లో ఉండాల్సి వచ్చిందన్నారు.ఆ వ్యక్తి అభిమానులు ఇప్పుడు తనపై ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో తనపై దాడి చేయడానికి నదరు వ్యక్తి అనుచరులు ప్లాన్ చేశారన్నారు. అందుకే అన్ని ఆధారాలు సేకరించి విశాఖ సీపీకి ఫిర్యాదు చేశానని తెలిపారు.
తనకు భద్రత ఇవ్వమని పోలీసులను కోరలేదని.. తగిన చర్యలు తీసుకోవాలని మాత్రమే ఫిర్యాదు చేశానని అన్నారు. విశాఖలోని జై భారత్ నేషనల్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నాడు పలువురు లక్ష్మీనారాయణ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... ఏపీని సీఎం జగన్ రెడ్డి (CM Jagan) అప్పుల్లో ముంచారని ధ్వజమెత్తారు.వైసీపీ అధికారంలోకి రాకముందు రాష్ట్రానికి ఎన్ని అప్పులు ఉన్నాయి?.. ఇప్పుడు ఎంత ఉన్నాయో జగన్ చెప్పాలని ప్రశ్నించారు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్