పలాస గ్రామీణం, 28 ఏప్రిల్ (హిం.స): పలాస నియోజకవర్గంలోని కొండలు, చెరువులను మింగేస్తున్న మంత్రి అప్పలరాజును ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు పిలుపునిచ్చారు. తెదేపా పలాస ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరీష, ఆ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కలమట వెంకటరమణతో కలిసి ఎంపీ రామ్మోహన్నాయుడు శనివారం ప్రచారం నిర్వహించారు. పలాస మండలం మామిడిపల్లి, బొడ్డపాడు, మాకన్నపల్లి, నీలావతి, కొబ్బరిచెట్లూరు, సున్నాదేవి, లొద్దభద్ర, రెంటికోట తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మంత్రి అప్పలరాజు తన అధికారాన్ని పలాస అభివృద్ధి కోసం వినియోగించకుండా కొండలు దోచుకోవడానికే ఉపయోగించారని, అందుకే ఆయన కొండలరాజుగా ప్రసిద్ధి చెందారని ఎద్దేవా చేశారు. జగన్ సీఎం కావడంతో ఆడపడుచులు, రైతులు, యువకులకు నష్టం జరిగిందని, ఈసారి ఆ పొరపాటు చేయొద్దని కోరారు. మళ్లీ రాష్ట్రం గాడిలో పడాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలన్నా.. చంద్రబాబును సీఎం చేయాలని కోరారు. గౌతు శిరీష మాట్లాడుతూ.. మోసం, దగా, కుట్ర, అబద్ధాలు తప్ప ఎలాంటి అభివృద్ధి, సంక్షేమం చేయలేని వైకాపాకు మరో అవకాశం ఇవ్వొద్దని కోరారు. కార్యక్రమంలో వజ్జ బాబూరావు, పీరుకట్ల విఠల్, దువ్వాడ హేంబాబు చౌదరి, కిక్కర డిల్లీరావు తదితరులు పాల్గొన్నారు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్