అమరావతి: 02 ఏప్రిల్ (హిం.స)మంత్రి జోగి రమేష్, ఆయన కుమారుడి రాజకీయాలు ప్రశాంతతకు నిలయమైన కృష్ణా జిల్లా పెనమలూరును దౌర్జన్యాలు, దాడులకు కేంద్రంగా మారుస్తున్నారు. తాజాగా ఉయ్యూరులో జరిగిన ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కూటమి మచిలీపట్నం లోక్సభ అభ్యర్థి బాలశౌరి, పెనమలూరు అభ్యర్థి బోడే ప్రసాద్, కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్ తదితర నేతలంతా కలిసి ఉయ్యూరులో బుధవారం ప్రచారం నిర్వహించారు. అభ్యర్థుల ర్యాలీ గురజాల డొంక రోడ్డు వద్ద ఉండగా.. కూటమి శ్రేణులు ముందుగా ద్విచక్ర వాహనాలతో ఉయ్యూరులోకి వచ్చారు. విజయవాడ-మచిలీపట్నం ప్రధాన రహదారిపై మసీదు ప్రాంతంలో ఉన్న వైకాపా కార్యాలయం వద్దకు వాహనాల ర్యాలీ రాగానే.. అక్కడే అనుచరులతో ఉన్న మంత్రి జోగి రమేష్ తనయుడు రాజీవ్ కూటమి శ్రేణులను రెచ్చగొట్టేందుకు యత్నించాడు. సౌండ్ బాక్సుల్లో పెద్దగా జగన్ పాటలు వేశాడు. అనుచరులు కొందరు రోడ్డుకు రెండు వైపులా నిలబడి వైకాపా జెండాలు పట్టుకొని ‘జై జగన్’ అని నినాదాలు చేస్తుండగా, ఇంకొందరు వాహనాల ర్యాలీ మధ్యలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. అయినా సంయమనం పాటించి కూటమి శ్రేణులు వెళ్తుంటే.. ర్యాలీ చివర్లో కారును రోడ్డుపైనే ఆపిన రాజీవ్ డోర్ తీసి దానిపై నిలబడి కూటమి శ్రేణులను ఉద్దేశించి మీసాలు మెలేశాడు. వైకాపా జెండా ఊపుతూ తొడగొట్టి ‘దమ్ముంటే చూసుకుందాం రండి’ అని సవాలు విసిరాడు. అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకొని వెళ్లిపోవాలని సూచించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్