, హైదరాబాద్: 02 మే (హిం.స)సైబర్ నేరగాళ్లకు మ్యూల్ బ్యాంకు ఖాతాలు సమకూర్చుతున్న పెద్ద ముఠాలో కీలక సభ్యుడైన ఓ యువకుడిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎస్బీ) అధికారులు అరెస్టు చేశారు. అతని నుంచి రెండు సెల్ఫోన్లు, మూడు బ్యాంకు పాస్బుక్కులు, 43 చెక్బుక్కులు, 30 ఏటీఎం కార్డులు, 8 సిమ్కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎస్ఎస్బీ డైరెక్టర్ షికా గోయల్ బుధవారం ఒక ప్రకటనలో వివరించారు. అందులోని వివరాల మేరకు.. ‘నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన షిండే ప్రణయ్(26) క్రికెట్ బెట్టింగ్ అనుభవంతో టెలిగ్రామ్ యాప్ ద్వారా పలువురితో సంబంధాలు ఏర్పర్చుకున్నాడు. తర్వాత కమీషన్ పద్ధతిలో క్రికెట్ బెట్టింగ్ యాప్లకు వినియోగదారులను సమకూర్చేవాడు. ఈ క్రమంలోనే సైబర్ నేరగాళ్లకు మ్యూల్ ఖాతాలు సమకూర్చడమూ మొదలుపెట్టాడు. ఒక వ్యక్తి పేరుపై ఖాతా తెరిచి, దాన్ని మరొకరికి ఇవ్వడమే మ్యూల్ అంటారు. వీటికి సంబంధించిన చెక్బుక్కులు, ఏటీఎం కార్డులు కూడా అసలు ఖాతాదారుడి వద్ద ఉండవు. సైబర్ నేరగాళ్లు తాము కాజేసిన డబ్బును తొలుత ఈ ఖాతాల్లోకే మళ్లిస్తారు. తరువాత ఏటీఎంలు, చెక్బుక్కుల ద్వారా డ్రా చేసుకుంటారు. ప్రతిఫలంగా ఖాతాలు సమకూర్చిన వారికి కమీషన్ ఇస్తారు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్