అనకాపల్లి/దేవరాపల్లి,5 మే (హిం.స): అనకాపల్లి కూటమి అభ్యర్థి, బీజేపీ నేత సీఎం రమేశ్పై ఉప ముఖ్యమంత్రి, అనకాపల్లి పార్లమెంటు వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు అనుచరులు దాడికి తెగబడ్డారు. గాయపడిన బీజేపీ నేతను పరామర్శించేందుకు వెళ్తున్నక్రమంలో సీఎం రమేశ్ను అడ్డగించడంతోపాటు.. ఆయనపై దాడి చేసి.. చొక్కా చింపేశారు. బూడి స్వగ్రామమైన దేవరాపల్లి మండలం తారువలో శనివారం ఈ ఘటన జరిగింది. గ్రామంలో బీజేపీ జెండా ఎగురవేశారనే కారణంతో ఆ పార్టీ నాయకులపై ముత్యాలనాయుడు అనుచరులు దాడి చేశారు. ఇంట్లో వస్తువులను ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న రమేశ్ హుటాహుటిన ఆ గ్రామానికి వెళ్లారు. అయితే పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి తరువాత విడుదల చేశారు. తమ పార్టీ వారిని ఇంట్లోకి దూరి కొట్టారని రమేశ్ బృందం ఆరోపిస్తూ బూడి, ఆయన అనుచరులపై ఫిర్యాదు చేసింది. హత్యాయత్నం కేసుగా నమోదు చేయాలని డిమాండ్ చేసింది.
హిందూస్తాన్ సమాచార రాజీవ్