, నెల్లూరు(విద్య): 07 మే (హిం.స)ఎన్నికలు వచ్చాయంటే చాలు.. అయిదేళ్లుగా కానరాని నేతలు సందు, గొందుల్లో దర్శనమిస్తారు. ఇంటింటి ప్రచారానికి తెరదీస్తారు. ఆ క్రమంలో కొందరు ఏ ఇంట ఎన్నెన్ని ఓట్లు ఉన్నాయో తెలుసుకుని.. ఓటుకింత లెక్కగట్టడం మామూలుగా మారింది. మరికొందరు చీరలు, వెండి వస్తువులతో ప్రలోభాల వల విసరడం రివాజుగా మారింది. ఈ తరహా రాజకీయం మామూలైపోయిందని కొందరి సరిపెట్టుకుంటుండగా- మరికొందరు మాత్రం తమ ప్రాంత అభివృద్ధిని కాంక్షిస్తూ.. అలాంటి పార్టీలు, నాయకులకు తగిన రీతిలో సమాధానం ఇస్తున్నారు. అలా నెల్లూరు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ‘మా ఇంట్లో ఓట్లు అమ్మకానికి లేవు.. ఎన్నికల్లో ఓట్లు కొనేవాళ్లు మా ఇంటికి రావద్దు’ అనే బోర్డులు ఇంటి బయట గేట్లకు తగిలించడం ఆలోచింపజేస్తోంది. సండే మార్కెట్ కమిటీ సభ్యుల ఆలోచనతో.. తొలుత కమిటీ జిల్లా అధ్యక్షుడు ఎండీ హఫీజుద్దీన్, జిల్లా కార్యదర్శి సెంథిల్కుమార్, మాజీ కార్యదర్శులు వడివేలు, చరవణన్, టి.రమేష్, కోశాధికారి ముత్తుమారి తదితరుల ఇళ్ల గేట్లకు వెలిసిన ఈ బోర్డులు.. ప్రస్తుతం నెల్లూరు నగరంలోని పొగతోట, గాంధీనగర్, సంతపేట, స్టోన్హౌస్పేట, వేదాయపాళెం, కలెక్టరేట్ పరిసరాల్లోనూ కనిపిస్తున్నాయి.
హిందూస్తాన్ సమాచార రాజీవ్