దిల్లీ: పశ్చిమ బెంగాల్ రాజకీయాలను కుదిపేసిన ఉపాధ్యాయ నియామక కుంభకోణం వ్యవహారంపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా బెంగాల్ ప్రభుత్వానికి కఠిన ప్రశ్నలు సంధించింది. ఎంపిక ప్రక్రియ అంశం కోర్టులో ఉండగానే కొత్త పోస్టులు సృష్టించి నియామకాలు ఎలా చేపట్టారని ప్రశ్నించింది. వ్యవస్థపై ప్రజలు నమ్మకాన్ని కోల్పోతే.. ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారని ఆగ్రహించింది.
బెంగాల్లో 2016 నాటి స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్ (SLST) నియామక ప్రక్రియ చెల్లదని ఇటీవల కలకత్తా హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 25,743 మంది టీచర్లు, నాన్టీచింగ్ సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ జరిపింది. ఈసందర్భంగా దీదీ సర్కారు తీరుపై అసహనం వ్యక్తం చేసింది.
హిందుస్థాన్ సమాచార నాగరాజ్