పిఠాపురం,08 మే (హిం.స): పిఠాపురంలో ఈ నెల 10న జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించనున్న రోడ్షోకు అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. రోడ్ షోకు అనుమతుల కోసం తెదేపా, జనసేన నేతలు... స్థానిక ఆర్వో కార్యాలయానికి మంగళవారం ఉదయం 9 గంటలకు వెళ్లారు. సర్వర్ పని చేయడం లేదని సిబ్బంది చెప్పడంతో సాయంత్రం వరకూ అక్కడే వేచి ఉన్నారు. సాయంత్రం ఆరున్నర గంటలకు సర్వర్ పని చేస్తోందని చెప్పి, దరఖాస్తు తీసుకున్న సిబ్బంది ఓటీపీ నంబరు ఇచ్చారు. అదే రోజున సీఎం జగన్ బహిరంగ సభ ఉంటుందని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో పవన్ రోడ్షోకు అనుమతులు ఇస్తారా, లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్వర్ నిజంగానే మొరాయించిందా, కావాలనే ఆటంకం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారా?.. అనేది సందేహాస్పదంగా మారింది. జగన్ సభకోసం వైకాపా నేతలు దరఖాస్తు చేసుకున్నారా, లేదా అనేది తెలియడం లేదు. దీనిపై తెదేపా నేత ఎస్వీఎస్ఎన్ వర్మ.. ఆర్వోతో మాట్లాడినట్లు చెప్పారు. ఎవరు ముందు దరఖాస్తు ఇస్తే వారికే అనుమతి వస్తుందని చెప్పారన్నారు. పవన్ రోడ్షోకు అనుమతి వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్