పెనమలూరు, 09 మే (హిం.స(: ఎన్నికల వేళ.. పెనమలూరు నియోజకవర్గంలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు వైకాపా సిద్ధం చేసిన భారీ తాయిలాలు మంగళవారం అర్ధరాత్రి పోలీసులకు పట్టుబడ్డాయి. మంత్రి జోగి రమేష్ ఎన్నికల బరిలో ఉన్న ఈ నియోజకవర్గంలో జరిగిన ఈ సంఘటనపై కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పోరంకి ఏవీఎం గార్డెన్స్లోని ఓ ఇంటిపై మంగళవారం రాత్రి ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే. గృహాపకరణాలు, పార్టీ జెండాలు, తోరణాలు, బ్యానర్లు, ప్లాస్కులు, హాట్బాక్సులు వంటి 22 రకాల వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 476 చీరలు, 192 ప్లాస్కులు, 150 ఫ్రెష్మీల్స్ సెట్బాక్సులు, మిల్టన్ థర్మోవేర్ హాట్బాక్సులు 29 బ్యాగ్లు, పరాస్ హోమ్ వేర్ హాట్పాట్ బాక్సులు 46, వైకాపా గుర్తులు కలిగిన ప్యాంటు, షర్టులున్న 41 బాక్సులు, 90 స్టేషనరీ బ్యాగులు ఉండగా మిగతావి వైకాపా జెండాలు, తోరణాలు, బ్యానర్లు ఉన్నాయి. వీటిని భద్రపరిచిన ఇల్లు మండవ సతీష్దిగా పోలీసులు గుర్తించారు. వీటి విలువ రూ.5.90 లక్షలుగా అంచనా వేశారు. ఈ ఇంటిని గత ఫిబ్రవరిలో నెలకు రూ.10 వేలు అద్దె చెల్లించే ఒప్పందంతో తీసుకొన్నట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. మనో జ్ అనే వ్యక్తి ఈ ఇంటిని అద్దెకు తీసుకొన్నట్లు తెలుసుకున్నారు. ఇంటి యజమాని నుంచి సేకరించిన మనోజ్ ఫోన్ నంబరుకు ఫోన్ చేస్తుండగా అతని నుంచి ఫోన్ ఎత్తకపోవడంతో ఇంటి యజమాని తల్లి సమక్షంలో పోలీసులు ఇంటి తాళాలు పగలగొట్టి ఆయా వస్తువులను పోలీసులు, ఫ్లయింగ్స్క్వాడ్ అధికారులు మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్