బెంగళూరు, 11 జూన్ (హి.స.)కర్ణాటక రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో ఈడీ ఏకకాలంలో ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (KVSTDCL) నిధుల మళ్లింపుకు సంబంధించి కాంగ్రెస్ నేతలపై ఈడీ విచారణ కొనసాగుతోంది. దీనిలో భాగంగా బుధవారం ఎనిమిది ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
బల్లారీ లోక్సభ ఎంపీ ఈ. తుకారాం (Ballari MP Thukaram), ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులతో సంబంధం ఉన్నట్లుగా గుర్తించి వారికి సంబంధించిన ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు.
వాల్మీకీ కార్పొరేషన్ నిధులను లోక్సభ ఎన్నికల ప్రచారానికి వినియోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. జులై 2024లో కాంగ్రెస్ ఎమ్మెల్యే బసనగౌడ ఇంట్లో సైతం ఈడీ దాడులు జరిపింది. ఆయన (KVSTDCL) చైర్మన్గా ఉన్న సమయంలో నిధుల మళ్లింపు జరిగిందనే ఆరోపణలపై మనీలాండరింగ్ కేసులో ఈ విచారణ చేపట్టింది. అప్పట్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొత్తం 20 చోట్ల ఈడీ సోదాలు జరిపింది. ఈ దర్యాప్తుల నేపథ్యంలో, కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర స్పందిస్తూ ‘ఈడీకి దాడులు జరిపే హక్కు ఉంది. ఇది ప్రభుత్వానికి అవమానకరంగా భావించాల్సిన అవసరం లేదు. కేంద్ర సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తాయి. రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కూడా ఈ కేసును విచారిస్తోంది’ అని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి