శ్రీకాకుళం, 14 జూన్ (హి.స.): జిల్లాలోని కూర్మ గ్రామంలోని ఆధ్యాత్మిక మందిరంలో అగ్నిప్రమాదం దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. అది ఆధునిక హంగులు లేకుండా ఆధ్యాత్మిక చింతనతో జీవించే గ్రామమని తెలిపారు. మూడు రోజుల క్రితం ఆధ్యాత్మిక మందిరంలో అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. మంటల ధాటికి భక్తులు పరుగులు తీశారు. ఈ ఘటనలో విలువైన గ్రంథాలు దగ్ధమయ్యాయి. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.
‘‘ ఆధ్యాత్మిక మందిరం అగ్నికి ఆహుతి కావడం దురదృష్టకరం. ఈ ఘటనపై పోలీసులు లోతుగా విచారణ చేయాలి. ఘటనపై అనుమానాలు ఉన్న దృష్ట్యా అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలి. గ్రామంలో ప్రస్తుత పరిస్థితిపై జిల్లా అధికారులతో మాట్లాడాలి. సనాతన ధార్మిక జీవనం కోసం ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ గ్రామం ఏర్పాటైంది. యాంత్రిక జీవన విధానాలకు భిన్నంగా మట్టి ఇళ్లలో ఉంటున్నారు. గ్రామ పునరుద్ధరణపై దృష్టి సారించాలి’’ అని పవన్ కల్యాణ్ కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ