అమరావతి, 16 జూన్ (హి.స.)
తుళ్లూరు, మంగళగిరి, రాజధాని ప్రాంతంలో మట్టి దొంగలు రెచ్చిపోతున్నారు. వైకాపా హయాంలో యథేచ్ఛగా సాగిన ఈ దందా.. కూటమి ప్రభుత్వం వచ్చినా కట్టడి కాలేదు. అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు కేటాయించిన ప్లాట్లలోని మట్టిని తరలించుకుపోతూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటూనే ఉన్నారు. ఘటనలు జరిగినప్పుడు హుటాహుటిన కేసులు నమోదు చేసి.. లారీలను సీజ్ చేయడం తప్ప పునరావృతం కాకుండా పటిష్ఠ నిఘా ఏర్పాటు చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెం సమీపంలో ఈ-9 రహదారి పక్కన కమర్షియల్ ప్లాట్లలో కొందరు వ్యక్తులు అక్రమంగా మట్టి తవ్వకాలు జరపడాన్ని గమనించిన రైతులు అడ్డుకున్నారు. దీంతో మట్టి దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. తవ్వకాల నిమిత్తం తీసుకువచ్చిన ఒక పొక్లెయిన్ను అక్కడే వదిలి వెళ్లిపోయారు. రాత్రివేళ గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం నడుస్తోందని సుమారు 100 టిప్పర్ల మట్టిని తరలించినట్లు కృష్ణాయపాలెం రైతులు చెబుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ