తిరుమల , 16 జూన్ (హి.స.)తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. అయితే దర్శనం, ఆర్జిత సేవల్ని ప్లాన్ చేసుకునే భక్తుల కోసం టీటీడీ ప్రతి నెలా ఆన్లైన్ కోటాను విడుదల చేస్తోంది. ఈ మేరకు సెప్టెంబర్ నెలకు సంబంధించి దర్శనం, ఆర్జిత సేవ, వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ నెల 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. సెప్టెంబర్ నెలకు సంబంధించి ఈ ఆర్జిత సేవల టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూన్ 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జూన్ 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్లో టికెట్లు మంజూరవుతాయి
జూన్ 23న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల పవిత్రోత్సవాల టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. జూన్ 23న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. జూన్ 24న ఉదయం 10 గంటలకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. జూన్ 24న ఉదయం 11 గంటలకు
శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల ఆన్ లైన్ కోటాను విడుదల చేయనున్నారు. జూన్ 24న మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా.. సెప్టెంబర్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి