వాషింగ్టన్, 3 జూన్ (హి.స.)
ప్రముఖ టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 శాతం మంది ఉద్యోగులను తగ్గించిన కొన్ని వారాల్లోనే, ఇప్పుడు మరికొంత మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.వాషింగ్టన్ స్టేట్ ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్కు మైక్రోసాఫ్ట్ సమర్పించిన ఫైలింగ్ ప్రకారం… వాషింగ్టన్ రాష్ట్రంలోని రెడ్మండ్ కార్యాలయంలో అదనంగా 305 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. గత నెలలో ప్రకటించిన 6,000 ఉద్యోగాల కోతకు ఇది అదనమని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. “మారుతున్న మార్కెట్లో కంపెనీ విజయం సాధించడానికి అవసరమైన సంస్థాగత మార్పులను కొనసాగిస్తున్నాము” అని ఆయన పేర్కొన్నారు.ఈ తొలగింపులపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందిస్తూ, ఇవి ఉద్యోగుల పనితీరుకు సంబంధించినవి కావని, సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగమేనని స్పష్టం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..