అమరావతి, 1 అక్టోబర్ (హి.స.): భారత మహిళా జట్టు క్రికెటర్ దీప్తి శర్మ చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా శుభారంభం చేసింది. శ్రీలంకపై 59 పరుగుల తేడాతో (డక్వర్త్లూయిస్ పద్ధతి) విజయం సాధించింది. ఆల్రౌండర్ దీప్తి శర్మ ఓ రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఇప్పటివరకు ఏ భారత మహిళా క్రికెటర్కు సాధ్యం కాని ఘనతను తన ఖాతాలో వేసుకుంది. శ్రీలంకపై హాఫ్ సెంచరీతోపాటు మూడు వికెట్ల ప్రదర్శన చేసింది. దీంతో వరల్డ్ కప్లో ఇలాంటి ఘనత సాధించిన తొలి టీమ్ఇండియా మహిళా క్రికెటర్గా రికార్డు సృష్టించింది. అయితే, వన్డేల్లో ఇలా నమోదు చేయడం ఆమెకు రెండోసారి.
తొలుత బ్యాటింగ్లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు దూకుడుగా ఆడింది. 53 బంతుల్లో 53 పరుగులు చేసింది. దీంతో 269 పరుగుల గౌరవప్రదమైన స్కోరును భారత్ చేసినట్లైంది. ఆమెతోపాటు అమన్ కౌర్ (57) కూడా రాణించింది. అయితే, 270 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకను కట్టడి చేయడంలో దీప్తిదే ప్రధాన పాత్ర. దూకుడుగా ఆడిన లంక కెప్టెన్ చమరి ఆటపట్టు (43)ను బౌల్డ్ చేసి భారత్కు బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత మరో రెండు వికెట్లు పడగొట్టి మ్యాచ్ను టీమ్ఇండియా వైపు తిప్పేసింది. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకుంది. వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్గానూ దీప్తి నిలిచింది. ప్రస్తుతం ఆమె ఖాతాలో 143 వికెట్లు ఉన్నాయి. స్టార్ పేసర్ జులన్ గోస్వామి (255) అగ్రస్థానంలో ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ