హైదరాబాద్, 1 అక్టోబర్ (హి.స.)
చౌటుప్పల్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సర్వీసు రోడ్డులో నిలిపి ఉంచిన రెండు తుఫాన్ వాహనాలపై కెమికల్ ట్యాంకర్ పడింది. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. హైదరాబాద్లోని జీడిమెట్ల నుంచి రసాయన ద్రావాన్ని ట్యాంకర్లో దామరచర్లలోని ఓ సిమెంటు పరిశ్రమకు తరలిస్తున్నారు. ఈ ట్యాంకర్ చౌటుప్పల్ వద్దకు చేరుకోగానే జాతీయ రహదారి పైనుంచి అదుపు తప్పి రెయిలింగ్ను ఢీకొట్టి సర్వీసు రోడ్డులో పార్కింగ్ చేసిన రెండు తుఫాన్ వాహనాలపై పడిపోయింది. ప్రమాదంలో నేరేడుచర్లకు చెందిన ట్యాంకర్ డ్రైవర్ రాములు గాయపడటంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తు సర్వీసు రోడ్డులో, తుఫాన్ వాహనాల్లో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చౌటుప్పల్ పోలీస్ ఇన్స్పెక్టర్ మన్మథకుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ విజయ్మోహన్, ఎస్సైలు కనకటి యాదగిరి, అజయ్భార్గవ్, ఆంజనేయులు, సైదిరెడ్డిలు ఘటనా స్థలిని పరిశీలించారు. క్రేన్ సాయంతో పోలీసులు ట్యాంకర్ను తొలగించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ