ఢిల్లీ, 14 అక్టోబర్ (హి.స.)గాజా యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో ఈజిప్టులో జరుగుతున్న ఉన్నత స్థాయి శాంతి సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీకి బదులుగా కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ను పంపాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దాదాపు 20 దేశాల అధినేతలు పాల్గొంటున్న ఈ కీలక సమావేశానికి ప్రధాని స్వయంగా హాజరుకాకపోవడం గందరగోళానికి గురిచేస్తోందని ఆయన అన్నారు.
ఈ అంశంపై తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో థరూర్ స్పందిస్తూ, ఇది వ్యూహాత్మక సంయమనమా? లేక చేజారిన అవకాశమా? అని ప్రశ్నించారు. మన పొరుగు ప్రాంతంలో జరుగుతున్న ఇంతటి ముఖ్యమైన భద్రతా సదస్సుకు ప్రధాని మోదీ వెళ్లకపోవడం తనను అయోమయానికి గురిచేసిందని పేర్కొన్నారు. పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూకే అధినేత కీర్ స్టామర్ వంటి ప్రపంచ దిగ్గజాలు హాజరవుతున్నారని, అలాంటి సమయంలో భారత్ నుంచి ప్రధాని స్థాయి వ్యక్తి వెళ్లకపోవడం సరైన సంకేతాలు పంపదని అభిప్రాయపడ్డారు.
ఇది సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ సామర్థ్యాన్ని ప్రశ్నించడం కాదు. కానీ ఇంతమంది అగ్రనేతలు హాజరైనప్పుడు, మన ప్రాతినిధ్యం కూడా అదే స్థాయిలో ఉండాలి. లేదంటే, మనం వ్యూహాత్మక దూరం పాటిస్తున్నామనే తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంది అని గతంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన థరూర్ వివరించారు.
.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV