ఢిల్లీ,18, అక్టోబర్ (హి.స.)** : దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న డిజిటల్ అరెస్టు మోసాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వ్యవస్థ పునాదులపై ప్రజావిశ్వాసాన్ని దెబ్బతీసే దాడిగా అభివర్ణించింది. న్యాయస్థానాల పేరుతో ఉత్తర్వులు... వాటిపై జడ్జీల సంతకాల ఫోర్జరీ, సీబీఐ, ఈడీ అధికారులమంటూ మభ్యపెట్టి బెదిరింపులకు దిగి భారీ మొత్తాలను ప్రజల నుంచి వసూలు చేయడం వంటివి సాధారణమైన నేరాలు కాదని తెలిపింది. వాటి నివారణకు సత్వరమే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్యా బాగ్చీ ధర్మాసనం అభిప్రాయపడింది. కేంద్రం, సీబీఐ స్పందన కోరుతూ శుక్రవారం ఆదేశాలిచ్చింది. డిజిటల్ అరెస్టు పేరుతో తమ నుంచి రూ.కోటికిపైగా వసూలు చేసిన మోసంపై హరియాణాలోని అంబాలాకు చెందిన 73 ఏళ్ల మహిళ గత నెల 21న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్కి ఫిర్యాదు చేశారు. ఈ కేసును న్యాయస్థానం సుమోటోగా స్వీకరించగా..జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్యా బాగ్చీ ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులను సృష్టించి మరీ నేరాలకు తెగిస్తున్న తీరును బయటపెట్టేందుకు కేంద్రం, రాష్ట్ర పోలీసుల మధ్య సమన్వయం అవసరమని అభిప్రాయపడింది. అంబాలా కేసు దర్యాప్తుపై స్థాయీ నివేదిక దాఖలు చేయాలని అటార్నీ జనరల్కు, స్థానిక సైబర్ క్రైమ్ విభాగానికి సూచించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ