పాక్టికా/ఢిల్లీ,19, అక్టోబర్ (హి.స.)కాల్పుల విరమణ ఒప్పందానికి ముందు పాకిస్థాన్- అఫ్గానిస్థాన్ల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అఫ్గాన్ అంతర్గత వ్యవహారాలశాఖ డిప్యూటీ మంత్రి మహమ్మద్ నబి ఒమారి (Muhammad Nabi Omari) పాక్కు గట్టి హెచ్చరికలు చేశారు. ప్రత్యర్థి ఎలాంటి ఆక్రమణకు పాల్పడినా.. తమ దళాలు వారిని భారత సరిహద్దు వరకూ పరిగెత్తిస్తాయని వ్యాఖ్యానించారు.
ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఒమారి ఈ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం పాక్టికా ప్రావిన్స్పై పాక్ (Pakistan) వైమానిక దాడులకు పాల్పడి.. పౌరుల ప్రాణాలు తీయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆ దేశంలోని సైనిక నాయకత్వాన్ని విమర్శించారు. ఆ దేశ సైనిక పాలన ఇతరుల ఇష్టాలపై ఆధారపడి ఉంటుందన్నారు. ఇటీవల ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు సానుభూతిపరుడిలా మాట్లాడిన వీడియోల గురించి ప్రస్తావించారు.
కొన్ని రోజులుగా అఫ్గాన్- పాక్ సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. తొలుత అనుకున్న 48 గంటల కాల్పుల విరమణ పూర్తయిన వెంటనే అఫ్గాన్పై పాక్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురు యువ క్రికెటర్లతో సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు
*
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ