పట్నా:/ఢిల్లీ,19, అక్టోబర్ (హి.స.) గతంలో బిహార్లో ఆటవిక రాజ్యం ఉండేదని, ఇప్పుడు అదే కొత్త ముసుగు ధరించి.. ఇండియా కూటమి రూపంలో వస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. ఆ కూటమిని విశ్వసించవద్దని ఓటర్లకు హితవు పలికారు. ప్రధాని మోదీ, సీఎం నీతీశ్ల నేతృత్వంలో అభివృద్ధి పథంలో బిహార్ దూసుకువెళ్తోందని, ఎన్డీయే దీనిని ముందుకు తీసుకువెళ్తుందని హామీ ఇచ్చారు. మరోసారి తమ కూటమే అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్థాపించిన జన్సురాజ్ పార్టీ గురించి ఎన్నికల ఫలితాల అనంతరం మాట్లాడదామంటూ వ్యంగ్యంగా స్పందించారు. ‘ఏబీపీ న్యూస్, హిందుస్థాన్’ శనివారం ‘బిహార్ సమాగమ్’ పేరుతో పట్నాలో ఉమ్మడిగా నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాలకు ఓటమి భయం పట్టుకుందని, కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారో.. ఎవరు ఎక్కడినుంచి పోటీచేస్తారో వాటికే తెలియదని ఎద్దేవా చేశారు. ‘‘గత పాలనలో బిహార్ ఓ గుంతలా మారింది. 20 ఏళ్లలో దీన్ని పూడ్చాం. ఇప్పుడు నేల బలపడింది. ఆ బలమైన పునాదులపై భారీ నిర్మాణాలు చేపడతాం. కల్లబొల్లి మాటల్ని నమ్మొద్దు. బిహార్లో పరిశ్రమల ఏర్పాటుకు సరిపడా భూములు లేకపోవచ్చు. కానీ.. నాణ్యమైన శ్రామిక శక్తి ఉంది. మనం ఇప్పుడు కృత్రిమ మేధ యుగంలో ఉన్నాం. రాష్ట్రాన్ని ఏఐ హబ్గా మార్చాలనుకుంటున్నాం’’ అని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ