జెనీవా/దిల్లీ: 02,అక్టోబర్ (హి.స.): ఐక్యరాజ్యసమితి (United Nations)లో పాకిస్తాన్ మరోసారి పరువు పోగొట్టుకొంది. మానవ హక్కుల మండలిలో పాక్ వక్ర బుద్ధిని భారత్ దుయ్యబట్టింది. పాక్ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించింది. మైనారిటీలపై దాడులు జరిపే ఆ దేశం మానవహక్కులపై ఉపన్యాసాలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందంటూ భారతీయ దౌత్యవేత్త మొహమ్మద్ హుస్సేన్ చురకలు అంటించారు. పాక్ తప్పుడు ప్రచారాలు చేసే బదులు తన దేశంలోని మైనారిటీలపై చూపుతున్న వివక్షతో పోరాడాలంటూ హితవు పలికారు.
ఇటీవల పాకిస్తాన్లో ఆ దేశ సైన్యం చేసిన దాడిలో మహిళలు, పిల్లలతో సహా 23 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్లో మైనారిటీలపై జరుగుతున్న దాడులపై భారత్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ హక్కుల కార్యకర్త ఆరిఫ్ అజాకియా కూడా పాక్ సర్కార్ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. బలోచిస్థాన్, ఖైబర్ ప్రావిన్స్లు సుదీర్ఘకాలంగా సైనిక ఆపరేషన్లకు కేంద్రాలుగా మారిపోయాయని మండిపడ్డారు. పాకిస్తాన్ ఇతరుల ముందు మానవ హక్కుల పాఠాలు చెబుతోంది కానీ.. అక్కడి పరిస్థితులు చూస్తే వాటికి పూర్తిగా విరుద్ధం.. తప్పుడు ప్రచారాలతో మోసం చేస్తోందంటూ హుస్సేన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ