అమరావతి, 2 అక్టోబర్ (హి.స.)దేశ స్వాతంత్య్ర సముపార్జనలో ముందుండి దేశాన్ని నడిపించిన జాతిపిత మహాత్మా గాంధీ (Mahatma Gandhi) అని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. ఇవాళ ఆయన 156వ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తూ సీఎం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. భరత జాతిని ఏకతాటిపై నడిపించి బ్రిటీష్ సామ్రాజ్యంపై శాంతి, అహింసలతో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు. ఆ మహాత్ముడు చూపిన బాట, ఆయన ఆచరించిన విలువలు యువతరానికి ఆదర్శం కావాలన్నారు. అప్పుడే మనం కలలు కంటున్న నవ భారత దేశం సాకారం అవుతుందని పేర్కొన్నారు. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం వేరెవరో పరిరక్షించరు.. మనకు మనమే వాటిని కాపాడుకోవాలని గాంధీ చెప్పిన మాటలు స్ఫూర్తిదాయకమని తెలిపారు. జాతిపిత చూపిన బాటను అనుసరిస్తూ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడమే మన ముందున్న కర్తవ్యమని సీఎం చంద్రబాబు అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV