రాయ్పూర్, అక్టోబర్ 21: దేశంలో మావోయిస్టుల నిర్మూలన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిపై ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ క్రమంలో అక్టోబర్ 24వ తేదీన దేశవ్యాప్త బంద్కు మావోయిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు అభయ్ పేరుతో కేంద్ర కమిటీ మంగళవారం ఒక లేఖను విడుదల చేసింది. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కగార్ యుద్ధాన్ని సాగిస్తూ.. మావోయిస్టులను హత్య చేయడానికి నిరసనగా ఈ బంద్కు పిలుపునిచ్చినట్లు కేంద్ర కమిటీ విడుదల చేసిన ఆ లేఖలో పేర్కొంది. మావోయిస్టుల హత్యలకు నిరసనగా అక్టోబర్ 23వ తేదీ వరకు నిరసన వ్యక్తం చేయాలని ఆ పార్టీ స్పష్టం చేసింది. ఆపరేషన్ కగార్ నిలిపి వేయడానికి దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమం నిర్మించాలని ఆ లేఖలో సూచించింది.
ఛత్తీస్గఢ్లో మాత్రం మావోయిస్టులు బలంగా ఉన్నారు. దీంతో ఆ రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర బలగాలు.. నిరంతరాయంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. దాంతో వరుస ఎన్కౌంటర్లు చోటు చేసుకుని.. పలువురు మావోయిస్టు అగ్రనేతలు మరణించారు. అలాగే వందల మంది మావోయిస్టులు సైతం మృతి చెందారు. భారీగా మావోయిస్టులు సైతం అరెస్టయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ