హైదరాబాద్, 3 అక్టోబర్ (హి.స.) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం పై మరోసారి విరుచుకుపడ్డారు. రేవంత్ పాలన లో ఆర్థిక విధ్వంసానికి ఆనవాళ్లు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. సెప్టెంబర్ 2025లో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్ల వృద్ధి రేటులో దేశంలోనే అట్టడుగున తెలంగాణ ఉండటం దారుణమని రాసుకొచ్చాడు. అలాగే సరిగ్గా రెండేళ్ల క్రితం, కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని, రేవంత్ పరిపాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎంత విధ్వంసం పాలయ్యిందో చెప్పే ఒక సూచిక ఇదేనని రాసుకొచ్చాడు.
అలాగే బీఆర్ఎస్ హయాంలో అన్ని రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దన్నుతో ఆర్థిక వ్యవస్థ పరుగులు తీసిందని, వ్యవసాయం నుంచి ఐటీ వరకు అన్ని రంగాలు రికార్డులు తిరగ రాశాయి. కానీ ఇవాళ కాంగ్రెస్ పాలనలో మాత్రం పండగొచ్చినా, పబ్బమొచ్చినా కూడా అన్ని రంగాలు నేలచూపులే చూస్తున్నాయని, వ్యవసాయం నుంచి రియల్ ఎస్టేట్ వరకు అన్ని రంగాల్లో దైన్యమే తాండవిస్తోంది. అరాచకత్వం అవినీతి, అనుభవలేమి కలగలసిన రేవంత్ పాలనలో తెలంగాణ ఆర్థిక విధ్వంసానికి గురవుతోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..