అమరావతి, 3 అక్టోబర్ (హి.స.)
: తిరుమల శ్రీవారి చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం భక్తులు భారీగా విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు స్వామివారి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది. అనంతరం శ్రీ భూవరాహస్వామి ఆలయం ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం అద్భుతంగా నిర్వహించారు. తొమ్మిది రోజుల ఉత్సవాల్లో జరిగిన అన్ని సేవలూ సఫలమై లోకం క్షేమంగా ఉండటానికి, భక్తులు సుఖశాంతులతో ఉండటానికి స్వామివారికి చక్రస్నానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ