ఢిల్లీ, ,03 అక్టోబర్ (హి.స.) హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేస్తూ పట్టుబడిన విషయం తెలిసిందే. తాజాగా, హర్యానాకు చెందిన మరో యూట్యూబర్ వసీం అక్రమ్ కూడా పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) తరుపున గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణలతో అధికారులు అరెస్ట్ చేశారు. మేవాట్ హిస్టరీపై యూట్యూబ్ లో వీడియోలు చేసిన పాల్వాల్ జిల్లాలోని కోట్ గ్రామానికి చెందిన అక్రమ్ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు.
వసీం అక్రమ్ గత మూడేళ్లుగా పాకిస్తాన్ ఏజెంట్లతో టచ్లో ఉన్నాడని, వారికి సిమ్ కార్డులు కూడా అందించినట్లు తేలింది. అతడి వాట్సాప్ చాట్ నుంచి నేరపూరిత మెసేజులను పోలీసులు గుర్తించారు. చాట్ నుంచి తొలగించిన మెసేజ్లను తిరిగి పొందేందుకు అతడి మొబైల్ను ఫోరెన్సిక్కు తరలించారు. పాల్వాల్ పోలీసులు గత వారం మరో పాకిస్తాన్ గూఢచారి తౌఫిక్ను కూడా అరెస్ట్ చేశారు. ఇతనే అక్రమ్ సమాచారాన్ని పోలీసులకు అందించాడు. 2021లో అక్రమ్ పాకిస్తాన్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు పాకిస్తాన్ ఏజెంట్ డానిష్తో పరిచయం ఏర్పడింది.
అక్రమ్, తౌఫిక్ ఇద్దరూ ఇంటర్నెట్ కాల్స్ ద్వారా ఐఎస్ఐ, పాకిస్తాన్ హైకమిషన్తో సంప్రదింపులు జరిపారు. ఇద్దరు నిందితులు కూడా భారత్కు సంబంధించిన సున్నిత వివరాలను పాకిస్తాన్కు పంపుతున్నట్లు తేలింది. కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎష్పీ వరణ్ సింగ్లా చెప్పారు. ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ