ఢిల్లీ, ,03 అక్టోబర్ (హి.స.)రాజస్థాన్ రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరఫరా చేస్తున్న దగ్గు మందు వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. దగ్గు మందు తాగిన చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురై చనిపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా, భరత్పూర్ జిల్లాలో రెండేళ్ల ఓ బాలుడు దగ్గు మందు తాగిన తర్వాత అస్వస్థతకు గురై చనిపోయాడు. ఆ దగ్గు మందు తాగటం వల్లే తమ కుమారుడు చనిపోయాడని బాలుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
లుహాసా గ్రామానికి చెందిన నిషాల్ సింగ్ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఐదేళ్ల థాన్ సింగ్, రెండేళ్ల తీర్థరాజ్ సెప్టెంబర్ 23వ తేదీన అస్వస్థతకు గురయ్యారు. జలుబు, దగ్గు విపరీతంగా ఉండటంతో తల్లిదండ్రులు వారిని వైరా కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తీసుకెళ్లారు. డాక్టర్ బబ్లూ ముద్గల్ వారికి దగ్గు మందుతో పాటు మరికొన్ని మందులు రాసిచ్చాడు. నిషాల్ దంపతులు ఆస్పత్రిలోనే ఫ్రీగా మందుల్ని తీసుకుని ఇంటికి వచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ